AP: అసెంబ్లీలో ఎమ్మెల్యేల కొట్లాట. గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చూసి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలోనూ గౌరవ సభ్యులు ఘర్షణకు దిగడంతో అంతా బిత్తరపోతున్నారు. వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్.. అసెంబ్లీలో పరస్పరం కొట్టుకునే వరకూ దారి తీయడాన్ని అంతా తప్పుబడుతున్నారు.
ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారనేది టీడీపీ ఆరోపణ. స్పీకర్ విధులకుకు టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారని.. పక్కకు తప్పుకోండని అంటే తమపైనే దాడికి దిగారనేది వైసీపీ కౌంటర్.
సభలో జరిగింది ఏదైనా.. తప్పు ఎవరిదైనా.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకోవడం, తోసుకోవడం, కిందపడటం మాత్రం సభ్య సమాజం అంగీకరించే విషయం కాదు. అందుకే, సభా సమరంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.
అసెంబ్లీలో జీవో నెంబర్ 1 రద్దు చేయాలని అడిగితే తమ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే పారిపోతామని అనుకుంటున్నారా? ఎదురుతిరుగుతాం.. తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చిందంటూ.. చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో చీకటిరోజు అన్నారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీకి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని.. అందుకే మతిభ్రమించి తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను ఎడిట్ చేయకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాడులు చేయమని సీఎం జగన్ వారిని ప్రోత్సహిస్తున్నారని.. ముఖ్యమంత్రి దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనే తమపై దాడి చేశారని.. తిరిగి తామే స్పీకర్పై దాడి చేసినట్టు మీడియా ముందు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు.
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైసీపీపై ఫైర్ అయ్యారు జనసేనాని. ఇదే పరిస్థితి కొనసాగితే ఇలాంటి దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయని హెచ్చరించారు పవన్ కల్యాణ్.