Nellore: హీరో పరుగెడుతుంటాడు. వెనుకాల పోలీసులు ఛేజ్ చేస్తుంటారు. పరుగెడుతూ.. పరుగెడుతూ.. ఓ బ్రిడ్జి దగ్గర ఆగిపోతాడు. అప్పటికే పోలీసులు హీరోను చుట్టుముడుతారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు హీరో బ్రిడ్జిపై నుంచి నదిలో దూకుతాడు. ఈదుకుంటూ వెళ్లి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఇటువంటి ఘటనలు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాము. అయితే సేమ్ టూ సేమ్ ఇలానే ఓ వ్యక్తి ప్రయత్నించాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.
ఆదివారం ఇడిమేపల్లికి చెందిన కృష్ణ అనే వ్యక్తి టిప్పర్ నడుపుతూ.. తాటిపర్తి వద్ద ఓ ఆటోను ఢీ కొట్టాడు. వెంటనే అక్కడ జనాలు గుమికూడడంతో భయంతో టిప్పర్ను మరింత వేగంగా సంగం వైపు పోనిస్తూ దారిలో మళ్లీ ఓ గేదెను ఢీ కొట్టాడు. దీంతో వాహనాన్ని ఆపాలంటూ గ్రామస్థులు అతన్ని వెంబడించారు. కొంతదూరం వెళ్లాక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో కృష్ణను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కొంతదూరం వెళ్లాక టిప్పర్ను రోడ్డు పక్కన ఆపి కనిగిరి జలాశయం కాలువలోకి దూకాడు కృష్ణ. ఈదుకుంటూ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా పోలీసులు అతడిని వదలలేదు. గట్టుపై పరుగెడుతూ అతడిని వెంబడించారు. దాదాపు రెండు గంటల పాటు కృష్ణ ఈదుకుంటూ ముందుకు వెళ్లాడు. మధ్యలో ఓ చెట్టును పట్టుకొని కాసేపు ఆగి మళ్లీ ఈదడం మొదలు పెట్టాడు. అలా మొత్తం 3 కిలోమీటర్ల వరకు ఈదుకుంటూ వెళ్లాడు.
దీంతో కృష్ణను పట్టుకునేందుకు పోలీసులు గజఈతగాళ్ల సాయం తీసుకున్నారు. వాళ్లు కాలువలోకి దిగి కృష్ణను పట్టుకున్నారు. ఒడ్డుకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కృష్ణను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.