IND vs AUS 2nd ODI: వర్షం కురిసింది. పిచ్ స్వింగ్ మీదుంది. ఆసీస్ పేస్ అదిరింది. టీమిండియా బెదిరింది. వెరసి విశాఖ వన్డేలో భారత్ 117 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ, అదే పిచ్పై ఆస్ట్రేలియా మాత్రం రాణించింది. 11 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయి మ్యాచ్ ముగించేసింది. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. కీలకమైన మూడో వన్డే ఈ నెల 22న చెన్నైలో జరగనుంది.
ఆస్ట్రేలియా పేస్ ధాటికి సగం ఓవర్లు ఆడటమే టీమ్ఇండియా కష్టమైంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ గిల్ వికెట్ను కోల్పోయిన భారత్. విరాట్ కోహ్లి(31) టాప్ స్కోరర్. ఆఖర్లో అక్షర్ పటేల్ (29) కాస్త పరువు కాపాడాడు. ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ గోల్డన్ డక్గా వెనుదిరిగాడు. శుబ్మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ చెలరేగి పోయి.. 5 వికెట్లు తీశాడు. సీన్ అబాట్ 3, ఎల్లీస్ 2 వికెట్లు పడగొట్టాడు.
స్వల్ప టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా చాలా ఈజీగా మ్యాచ్ను ఫినిష్ చేసేసింది. బ్యాటింగ్లానే బౌలింగ్లోనూ టీమ్ఇండియా చేతులెత్తేసింది. రోహిత్ సేన విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. సిక్స్లు, ఫోర్లతో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51), మార్ష్ (66)లు.. రబ్బర్ బాల్తో ఆడినట్టు ఆటాడుకున్నారు. మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 6 ఫోర్లు, 6 సిక్స్లతో మార్ష్ భారత బౌలర్లకు పగటిపూటే చుక్కలు చూపించాడు.
ఒకప్పుడు అనేక రికార్డులకు వేదికగా నిలిచిన విశాఖ స్టేడియంలో.. టీమ్ఇండియా ఇప్పుడింత ఘోరంగా ఓడిపోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.