TSPSC: రేవంత్రెడ్డి ఓ టాపిక్ డీల్ చేస్తే.. దాని అంతుచూసే వరకూ వదలరు. గతంలో కేటీఆర్ ఫామ్హౌజ్ విషయంలో ఆయన దూకుడు నెక్ట్స్ లెవెల్. కాంట్రవర్సీపై కంప్లీట్ మేటర్ సేకరిస్తారు. దాన్ని ప్రజలు, మీడియా ముందు ఉంచుతారు. ఆ తర్వాత కోర్టులో పోరాడుతారు. ఫలితం ఎలా ఉన్నా.. పోరాటం మాత్రం ఆపరు. దటీజ్ రేవంత్రెడ్డి.
లేటెస్ట్గా పాదయాత్ర చేస్తూనే.. TSPSC పరీక్షా పత్రాల లీకేజీపై గట్టి పోరాటం చేస్తున్నారు. లీకేజీలో అసలేం జరిగిందో సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లతో అప్డేట్స్ ఇస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ టీమ్ కంటే కూడా.. రేవంత్ రెడ్డి దగ్గరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు కనిపిస్తోంది.
గ్రూప్ 1 పేపర్ లీకేజీ వెనుక కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందంటూ మొదటినుంచీ ఆరోపిస్తున్నారు రేవంత్రెడ్డి. లేటెస్ట్గా మరిన్ని వివరాలు బయటకు తీశారు. నిందితుడు రాజశేఖర్రెడ్డితో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని.. వారిద్దరిదీ పక్కపక్క గ్రామాలేనని.. తిరుపతి చెబితేనే రాజశేఖర్రెడ్డికి కేటీఆర్ ఉద్యోగమిచ్చారని చెప్పారు. తిరుపతి స్వగ్రామం మల్యాలలో 100 మందికి వందకుపైగా మార్కులు వచ్చాయని.. అందుకే, గ్రూప్-1 ప్రిలిమ్స్లో 100 మార్కులు దాటిన వారందరినీ విచారించాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
ఇప్పుడే కాదు.. 2016 గ్రూప్-1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు రేవంత్. అమెరికా నుంచి వచ్చి నేరుగా గ్రూప్-1 రాసిన అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్నారు. అలాగే, టీఎస్పీఎస్సీ ఉద్యోగికి 4వ ర్యాంక్ వచ్చిందని.. వారిద్దరికీ ఎవరి వల్ల ఉద్యోగాలు వచ్చాయో తేల్చాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం టీఎస్పీఎస్సీలోని ఉద్యోగులకు పరీక్షలు రాసే అర్హత లేదని.. అలాంటప్పుడు కమిషన్లో పనిచేస్తోన్న 20 మంది పరీక్షలు ఎలా రాశారని ప్రశ్నించారు. గతంలో కమిషన్లో పని చేసిన ఓ ఉద్యోగి గ్రూప్-1కు ఎంపికయ్యారని రేవంత్రెడ్డి తెలిపారు. గ్రూప్-2లో ఓకే చోట పరీక్ష రాసిన 25 మందికి ఉద్యోగాలొచ్చాయని.. ఈ వ్యవహారం అంతా కేటీఆర్ ఆఫీస్ నుంచే నడిచిందని ఆరోపించారు.
పేపర్ లీకేజీ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకుండానే కేవలం ఇద్దరు మాత్రమే తప్పు చేశారని మంత్రి కేటీఆర్ ఎలా చెబుతారని రేవంత్రెడ్డి నిలదీశారు. లీకేజీ వ్యవహారంలో అధికారిణి శంకరలక్ష్మి పాత్ర ఏంటనేది బయటపెట్టాలన్నారు. పెద్దల పేర్లు చెబితే ఎన్కౌంటర్ చేస్తామని రిమాండ్లో ఉన్న నిందితులను బెదిరించారని రేవంత్ ఆరోపించారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సోమవారం వాదనలు వినిపిస్తామన్నారు రేవంత్రెడ్డి.