Jagan: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఘోర పరాజయం. మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే.. మూడింట్లోనూ ఓటమి. అందులో రెండు రాయలసీమ..అందులోనూ కడప జిల్లా కూడా ఉండటం అవమానం. విశాఖనే రాజధాని అంటూ ఢంకా మోగిస్తున్నా.. ఉత్తరాంధ్రలోనూ అవమాన భారం. ఎందుకిలా? ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకింత దారుణంగా ఓడిపోయాం? అనే ఆత్మావలోకనంలో పడింది వైసీపీ.
సీఎం జగన్ ఫుల్ ఫైర్ మీదున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన ముందుకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారట. కీలక సమయంలో.. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్న సందర్భంలో.. ఇలా మూడు ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడం రాజకీయంగా తీవ్ర డ్యామేజ్ చేసే అంశమే. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీకి వెయ్యి ఏనుగుల బలం తెచ్చిపెట్టే విషయం.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్వరం మారిపోయింది. ఆయన మటల్లో విజయగర్వం సుస్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ సర్కారుకు సవాళ్లు విసురుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్ పని ఖతం అంటూ వార్నింగులు ఇస్తూ.. చంద్రబాబు దూకుడు పెంచారు. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం అమాంతం పెరిగిపోయింది. కొద్దిగా గట్టిగా ట్రై చేస్తే.. ఈజీగా గెలిచేయొచ్చనే ధీమా వచ్చింది.
పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. లోలోన రగిలిపోతోంది వైసీపీ. గ్రాడ్యుయేట్స్ కేటగిరి కాబట్టి.. ఇది ప్రజా వ్యతిరేకత కాదని, కేవలం ఉద్యోగులే తమ ఓటమికి కారణమని విశ్లేషిస్తోంది. పీఆర్సీ, డీఏ, పీఆర్సీలే కొంపముంచాయా? లేదంటే ప్రజల్లో తమ పాలన పట్ల విముఖత ఉందా? అంటూ ఆరా తీస్తోంది. కడపలోనూ ఓడిపోవడం దేనికి సంకేతం? టీడీపీ పుంజుకుంటోందా? అనే అనుమానమూ లేకపోలేదు. తమ ఓటర్లు వేరే ఉన్నారని.. పట్టభద్రుల స్థానాల్లో ఓడినా తమకు వచ్చే నష్టమేమీ లేదని పైకి మాత్రం ధీమాగా కనిపిస్తోంది అధికార పార్టీ. ఎమ్మెల్సీ ఓటమితో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
Tiger-Donkey: పులి గాడిద స్టోరీ.. నేటి రాజకీయాలకు సరైన నీతి..!
AP: ఎమ్మెల్సీ ఇంపాక్ట్.. జనసేనతో టీడీపీ కలుస్తుందా? కటీఫ్ చెబుతుందా? జగన్కు టెన్షన్!?