UP: వివాహ వేడుక వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు వధువును అత్తవారింటికి సాగనంపారు. ఇంతలోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది వధువు. అత్తవారింటికి రాలేనని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడి తరుపు వారంతా కంగుతిన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.
రాజస్థాన్కు చెందిన ఓ యువకుడికి వారణాసికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమయింది. ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి శనివారం వారి పెళ్లిని ఘనంగా చేశారు. ఆ తర్వాత అమ్మాయిని అత్తవారింటికి సాగనంపారు. పెళ్లికూతురుతో కలిసి వరుడు కారులో రాజస్థాన్ బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక.. వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు.
ఒక్కసారిగా కారు ఆపాలని అనడంతో.. ఏమైందో అర్థంకాక ఆపేశారు. ఇంతలోనే వధువు కారు దిగి కన్నీరు పెట్టుకోవడం మొదలు పెట్టింది. ఏమైందని అడగగా.. తనకు అత్తవారింటికి వెళ్లడం ఇష్టం లేదని.. తిరిగి వారణాసికి వెళ్లిపోతానని తేల్చి చెప్పింది. వాళ్లు ఎంత నచ్చజెప్పినా కూడా వినలేదు.
ఇంతలోనే పెట్రోలింగ్కు వెళ్తున్న పోలీసులు వాళ్లను గమనించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. జరిగిన విషయం అంతా తెలుసుకొని అమ్మాయితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆమె వినకపోవడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి వారణాసికి పంపించారు.