KCR: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. శనివారం సీఎం కేసీఆర్తో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇక ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులకు భరోసా ఇచ్చేలా, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న బోర్డునే రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రశ్నాపత్రం లీక్ కావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఏఈఈ, డీఏవో ఎగ్జామ్స్ను కూడా క్యాన్సిల్ చేసింది. తిరిగి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ను జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ను గతేడాది అక్టోబర్ 16న, ఏఈఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 22న, డీఏవో పరీక్షను ఫిబ్రవరి 26న నిర్వహించారు. ఇక పరీక్షలు రద్దు కావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.