Crime: ఇద్దరు యువతుల మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. గాఢంగా ప్రేమించుకున్నారు. రూమ్ తీసుకొని సహజీవనం చేశారు. ఇంతలోనే షాక్. అందులో ఓ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మామిడిగట్టులో జరిగింది ఈ ఘటన.
మామిడి గట్టుకు చెందిన సల్లూరి అంజలికి.. మన్నెగూడెంకు చెందిన మహేశ్వరి అలియాస్ మహేశ్తో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా మంచిర్యాలలో రూమ్ తీసుకొని ఉంటున్నారు. అంజలి మంచిర్యాలలోని ఓ ఆప్టికల్ షాప్లో పనిచేస్తుండగా.. మహేశ్వరి పెట్రోల్ బంక్లో పనిచేస్తూ.. ఇటీవలే మానేసింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
అప్పుడే వారి మధ్యలోకి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా మహేశ్వరికి శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మహేశ్వరి అతడిని అంజలికి పరిచయం చేసింది. కొద్దిరోజులకు మహేశ్వరిని దూరంపెట్టి శ్రీనివాస్ అంజలితో క్లోజ్గా మెలగడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో మహేశ్వరి వారిపై కోపం పెంచుకుంది.
బుధవారం రాత్రి మహేశ్వరి రూమ్కు వెళ్లి అంజలిని బైక్పై ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక శ్రీనివాస్కు కాల్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని.. తాను కూడా చేసుకుంటున్నానని చెప్పింది. వెంటనే శ్రీనివాస్ కార్లో వాళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అంజలిని, మహేశ్వరిని కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అంజలి మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.
అంజలి మెడ, పొట్ట భాగంలో కత్తిపోట్లు ఉండడంతో మహేశ్వరి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మహేశ్వరి, శ్రీనివాస్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహేశ్వరి ఒక్కతే హత్య చేసిందా?.. మరెవరైనా ఆమెకు సహకరించారా?.. ఈ ఘటనలో శ్రీవాస్ పాత్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.