Ramcharan : ఆస్కార్ అవార్డు సాధించిన RRR టీమ్ అమెరికా నుంచి స్వదేశానికి చేరుకుంది. రెండురోజుల క్రితమే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశాడు. తాజాగా రాజమౌళి, కీరవాణి హైదరాబాద్ చేరుకున్నారు. అటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీలో దిగాడు. సతీమణి ఉపాసనతో కలిసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన చెర్రీకి అభిమానులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ‘జై చరణ్’ అంటూ నినాదాలు చేశారు. మెగా పవర్ స్టార్ తో కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అభిమానులకు చెర్రీ అత్మీయ అభివాదం చేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఆదరించిన సినీప్రేమికులకు చెర్రీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘నాటు నాటు’ పాటను సూపర్హిట్ చేసిన భారతీయ సినీప్రియులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. ‘నాటు నాటు’ మా ఒక్కరి పాట మాత్రమే కాదు, మీ అందరి పాట అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. దేశ ప్రజలే నాటు నాటు పాటను ఆస్కార్కు తీసుకువెళ్లారని రామ్ చరణ్ చెప్పాడు.
ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిన తర్వాత RRR టీమ్ సభ్యులు ఒక్కొక్కరిగా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ కూడా నగరానికి రావాల్సి ఉంది. అయితే ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెర్రీకి ఆహ్వానం అందింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతోనూ చరణ్ భేటీ కానున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్-ఉపాసన దంపతులు శుక్రవారం రాత్రి వరకు ఢిల్లీలోనే ఉంటారు. హస్తినలో కార్యక్రమాలు పూర్తైన తర్వాత రామ్ చరణ్ దంపతులు హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉంది.
Meditation:ధ్యానం ఎంతసేపు చేస్తే మంచిది
Paper Leak: అస్సాంలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. టీచర్లే ప్రధాన నిందితులు..