MLC Elections : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చేలా ఉంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ లీడ్ లో ఉంది. వైసీపీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రమే లీడ్ లో ఉంది. కానీ రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు.
ఉత్తరాంధ్రలో టీడీపీకి ఊపు..
ఏపీలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 6 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్పై 23,278 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థికి 69,910 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 46,632 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 30,116 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్కు 7,112 ఓట్లు వచ్చాయి. మొత్తం 8 రౌండ్ల కౌంటింగ్ లో ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. మరో మూడు రౌండ్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ స్థానంలో టీడీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
రాయలసీమలోనూ జోష్..
తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానంలో 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 9,558 ఓట్ల లీడ్ లో ఉన్నారు. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి శ్రీకాంత్కు 49,173 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి శ్యామ్ప్రసాద్రెడ్డికి 39, 615 ఓట్లు పడ్డాయి.
ఇక్కడే వైసీపీ సత్తా..
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 3 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి. అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి 169 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసీపీ మద్దతు తెలిపిన చంద్రశేఖర్రెడ్డి 2 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.