RRR : ఆస్కార్’ అవార్డు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అమెరికా నుంచి స్వదేశం చేరుకుంది. రాజమౌళి , ఆయన సతీమణి రమా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి , ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రాజమౌళి, కీరవాణితో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం ప్రదర్శించారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. దీంతో పోలీసు భద్రత మధ్య కీరవాణి, రాజమౌళి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ టీమ్ మీడియాతో మాట్లాడలేదు. ‘జైహింద్’ అంటూ రాజమౌళి ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
RRR టీమ్ లో అందరికంటే ముందే ఎన్టీఆర్ అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. రామ్చరణ్ కూడా శుక్రవారం స్వదేశానికి వస్తున్నాడు. అయితే చెర్రీ నేరుగా హైదరాబాద్కు రావడం లేదు. సాయంత్రం వరకు ఢిల్లీలో ఉంటాడు. ఉదయం ఇండియా టుడే కాన్క్లేవ్లో అతిథిగా పాల్గొంటాడు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో రామ్ చరణ్ భేటీ కానున్నాడు. శుక్రవారం రాత్రికి మెగాపవర్ స్టార్ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ లో చరణ్కు ఘన స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డులో RRR మూవీ సత్తాచాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు అవార్డు దక్కింది. ఆస్కార్ పురస్కారాన్ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు కొన్ని రోజుల ముందే RRR టీమ్ అమెరికా వెళ్లింది.