TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రవీణ్ మహా కేటుగాడని తేలింది. నెట్వర్క్ ఎక్స్పర్ట్ రాజశేఖర్ సహాయంతో ఒకటి కాదు.. మొత్తం ఐదు పేపర్లు లీక్ చేశాడని సిట్ గుర్తించింది.
TSPSC అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్తో సర్వర్ లాన్ కనెక్షన్ ఛేంజ్ చేయించాడు. ఆ తర్వాత డైనమిక్ పాస్వర్డ్ను మార్చేశాడు. ఐపీ అడ్రస్లతో సర్వర్ హ్యాక్ చేసి.. అందులోని క్వశ్చన్ పేపర్స్ను తన పెన్డ్రైవ్లో ప్రవీణ్ కాపీ చేసుకున్నాడని తేలింది. ఏఈ, టైన్ ప్లానింగ్, వెటర్నరీ, గ్రౌండ్ వాటర్ ఇన్స్పెక్టర్, ఎంవీఐ.. పోస్టుల పేపర్లు కొల్లగొట్టాడు. ఇందులో మరో మూడు పరీక్షలు జరగాల్సి ఉంది. సరైన సమయంలో వాటిని అమ్మకానికి పెట్టాలనేది ప్రవీణ్ ప్లాన్.
పేపర్లైతే సంపాదించాడు. వాటిని ఎవరికి ఎలా అమ్మాలో ప్రవీణ్కి అర్థం కాలేదు. అందుకోసం రేణుక సాయం కోరాడు. తన దగ్గర TSPSC పేపర్లు ఉన్నాయని.. ఎవరికైనా కావాలంటే చెప్పమంటూ డీల్ మాట్లాడాడు. రేణుకు అందుకు సరేనని.. తమ్ముడి సాయంతో తెలిసినవారికి ఆ పేపర్లు అమ్మింది.
అంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ యవ్వారం ఎలా బయటకు వచ్చిందనేది మరింత ఆసక్తికరమైన విషయం. ఏఈ పరీక్ష జరిగిన రోజు వనపర్తిలో రేణుక అండ్ టీమ్ గ్రాండ్ పార్టీ చేసుకుందని తెలుస్తోంది. ఆ పార్టీలో వాటాల పంపకంలో తేడాలొచ్చి.. గొడవ జరిగిందని అంటున్నారు. వాళ్ల టీమ్లోని ఓ వ్యక్తే పేపర్ లీక్పై అధికారులకు సమాచారం అందించాడని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు, ఎస్బీ విభాగం ఆరా తీస్తున్నాయి.
లేటెస్ట్గా TSPSC పేపర్ లీకేజీ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఏ2 నిందితుడుగా ఉన్న నెట్వర్క్ ఎక్స్పర్ట్ రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అంటూ మంత్రి కేటీఆర్ అతని ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేటీఆర్ ఆరోపణలకు బీజేపీ సైతం కౌంటర్ ఇచ్చింది. అతన్ని నియమించింది బీఆర్ఎస్ నాయకుడేనంటూ సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగింది.
మరోవైపు, బండి సంజయ్ సైతం రంగంలోకి దిగారు. పేపర్ లీకేజ్ బాధ్యుడు మంత్రి కేటీఆరేనంటూ సంచటన ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదేనని.. అందుకే, కేటీఆర్ను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఆరోపించారు. త్వరలోనే వారి బండారం బయటపెడతామని హెచ్చరించారు.
పేపర్లు ఎవరు లీక్ చేసినా.. అందుకు ఎవరు బాధ్యులైనా.. ఆ శిక్ష అనుభవిస్తున్నది మాత్రం వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులే. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి పరీక్ష రాసిని వారంతా.. ఇప్పుడు ఏఈ పేపర్ రద్దు కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. వారి గోస వారికే తెలుసు.