Kavitha : ఢిల్లీ మద్యం కేసులో రెండోసారి ఈడీ విచారణకు కవిత హాజరుకాలేదు. కాసేపట్లో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉన్న సమయంలో ఆమె ఈ-మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా విచారణకు రాలేకపోతున్నానని పేర్కొన్నారు. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ఈ నెల 11న జరిగిన విచారణలో ఈడీ అధికారులు అడిగిన పత్రాలను తన న్యాయవాది భరత్ ద్వారా కవిత పంపారు.
ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ నెల 11న దాదాపు 9గంటల పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని అదే రోజు కవితకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను వెంటనే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 24న ఆ పిటిషన్ ను విచారిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఈడీ విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు వెళ్లాలా? వద్దా అనే అంశంపై న్యాయ నిపుణులతో కవిత చర్చించారు. ఆ తర్వాత విచారణకు రావడంలేదని ఈడీకి సమాచారం పంపారు.
కవిత విజ్ఞప్తిని ఈడీ డైరెక్టర్ అంగీకరించలేదు. విచారణకు రావాల్సిందేనని తేల్చిచెప్పారు.దీంతో కవిత విచారణకు వెళ్తారా లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆమె వెళ్లకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు శుక్రవారంతో ఈ కేసులో ఇద్దరు కీలక నిందితుల ఈడీ కస్టడీ ముగియనుంది. మనీశ్ సిసోడియా, అరుణ్ చంద్ర పిళ్లై, బుచ్చిబాబులను ఎదురుగా పెట్టి కవితను ఈడీ విచారించాలని భావించింది. దీంతో ఈ ముగ్గురి కస్టడీ ముగిశాకే విచారణకు హాజరుకావాలని కవిత వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్గౌడ్,సత్యవతి రాథోడ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడిస్తారేమోనని ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ఈడీ కార్యాలయం ద్వారాన్ని మూసివేశారు.