Dattatreya:నక్కలకు కూడా ప్రసాదం పెట్టే ఆలయం గుజరాత్ లో ఉంది. దేశంలోనే అతిపెద్ద జిల్లా కచ్ ముఖ్యకేంద్రానికి ఓ 90 కిలోమీటర్ల దూరంలో కాలో దుంగార్ అనే పర్వతం ఉంది. ఈ పర్వతం నల్లటి నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు. కాలో దుంగార్ పదిహేను వందల అడుగుల ఎత్తున ఉంటుంది. కాబట్టి ఈ పర్వతాన్ని ఎక్కితే దూరదూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. ఆఖరికి పాకిస్తాన్ భూభాగం కూడా కనిపిస్తుంది. అందుకని పర్యటకులు ఈ కొండని ఎక్కేందుకు ఉత్సాహ పడుతూ ఉంటారు.
నాలుగు వందల సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్ని అందించే ఆచారమూ సాగుతోంది. రోజూ మధ్యాహ్నమూ, సాయంత్రమూ ఇక్కడి దత్తాత్రేయ ఆలయంలో ఉన్న పూజారి ఒక అరుగు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఓ పళ్లెం మీద కొడుతూ లే అంగ్, లే అంగ్ అని అరుస్తాడు. పూజారి మాట కోసమే ఎదురుచూస్తున్నాయా అన్నట్లుగా… కొన్ని క్షణాల్లో పాతిక నక్కలు బిలబిలలాడుతూ వచ్చేస్తాయి. అరుగు మీద పూజారి ఉంచిన ప్రసాదాన్ని ఆవురావురుమంటూ తింటాయి.
కాలో దుంగార్లో జరిగే ఈ వింతను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. ఎన్ని వందల మంది ఆ ఆలయం చుట్టుపక్కల తిరుగుతున్నా, నక్కలు వారిని దాడి చేసిన ఘటనలకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేవు. క్రూరత్వానికి పేరు పొందిన నక్కలు కాస్తా ఆలయం దగ్గరకు రాగానే సాధు జంతువులుగా మారిపోతుంటాయి. ఇదంతా ఆ దత్తాత్రేయుని మహత్యమే అని చెబుతారు.