ICC: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో మనోళ్లు మళ్లీ సత్తా చాటారు. బోర్డర్-గావస్కర్ సిరీస్ను గెలుచుకోవడంతో ర్యాంకుల్లో మరింత పైపైకి ఎగిశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ల కేటగిరిలో భారత ఆటగాళ్లు అదరగొట్టేశారు.
టీమిండియాకు బ్యాటింగే బలం. కానీ, ఇటీవల భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. లేటెస్ట్గా ఆస్ట్రేలియా ప్లేయర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఆ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న రవిచంద్రన్ అశ్విన్.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా ఏడో స్థానంలో, రవీంద్ర జడేజా 9వ ర్యాంక్ సాధించారు.
బ్యాటింగ్లోనూ టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. అయితే నెంబర్ వన్ మాత్రం దక్కలేదు. రోడ్డు యాక్సిడెంట్కి గురైన రిషభ్ పంత్ 9వ స్థానంలో నిలవడం విశేషం. టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పదో స్థానంతో ఉన్నారు. ఆసీస్తో నాలుగో టెస్టులో సెంచరీ చేయడంతో.. విరాట్ కోహ్లీ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి.. 13వ ర్యాంక్లో నిలిచాడు. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టాప్ ర్యాంక్ సొంతం చేసుకుని నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు.
ఇక, టెస్ట్ ఆల్రౌండర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత ఆటగాళ్లవే. ఆసీస్తో టెస్టు సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను ఉమ్మడిగా గెలుచుకున్న రవీంద్ర జడేజా ఐసీసీ నెంబర్ వన్ ఆల్రౌండర్గా టాప్ ప్లేస్లో ఉన్నారు. అశ్విన్ది సెకండ్ ప్లేస్. అక్షర్ పటేల్కు 4వ ర్యాంక్.
టీమ్ వైజ్గా ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియానే టాప్లో కంటిన్యూ అవుతోంది. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్.. టాప్ -10లో ఉన్నాయి.
ఇలా అన్ని కేటగిరీల్లో టాప్ 10 ర్యాంకుల్లో టీమ్ఇండియా ప్లేయర్స్ సత్తా చాటారు. బ్యాటింగ్లోనే మనోళ్లు నెంబర్ వన్గా నిలిస్తే మరింత బాగుండేది.