Pawan Kalyan: పవన్ అంటే పవర్. పవన్ అంటే ఫైర్. పవన్ అంటే ఎమోషన్. పవన్ అంటే ఆవేశం. పవన్ అంటే పూనకం. పవన్ కల్యాణ్ ఓ పార్టీ అధినేత కాదు.. థౌజెండ్ వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్. టచ్ చేస్తే మసి అయిపోవాల్సిందే.. అంటూ పీకే ఫ్యాన్స్ తమ నాయకుడి గురించి గొప్పగా చెబుతుంటారు. కొన్ని విషయాలు చూస్తుంటే.. అది నిజమే అనిపించేలా ఉంటుంది.
జగన్ అంటే, జగన్ సర్కార్ అంటే.. ఒంటికాలిపై లేస్తున్నారు పవన్ కల్యాణ్. చెప్పు తీసి కొడతానంటూ పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా ప్రతీసారి పవన్ తమను గిల్లుతుంటే.. మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి రివర్స్ కౌంటర్లు ఇవ్వడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. మిగతా టీడీపీ నేతల్లా జనసేనానిపై పెట్టడానికి కేసులు, గట్రా కుదరడం లేదు. అందుకే, మీడియా ముందు పులుల్లా రెచ్చిపోతున్నారు మంత్రులు.
అదే చంద్రబాబు, టీడీపీ విషయంలో అలా కాదు. వారిపై మూకుమ్మడి దాడే. టీడీపీ అధినేతను కనీసం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంకు కూడా వెళ్లీనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి.. టీడీపీ సభలు, ర్యాలీలు, ప్రచార వాహనాలకు చెక్ పెడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పోలీసుల అడ్డగింపుతో.. 10 కి.మీ.లకు పైగా నడవాల్సి వచ్చింది చంద్రబాబు. నారా లోకేశ్ పాదయాత్రకూ అడుగడుగునా కొర్రీలు పెడుతున్నారు. ఇలా దాడి చేయడానికి పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ఆయుధం.. జీవో నెంబర్ 1.
టీడీపీని ఇంతలా టార్చర్ చేస్తున్న సర్కారు.. జనసేన విషయంలో మాత్రం అంతలా చేయలేకపోతోందనే వాదన ఉంది. అందుకు మంగళవారం నాటి జనసేన ఆవిర్భావ సభనే నిదర్శనం. విజయవాడ నుంచి మచిలీపట్నానికి భారీ ర్యాలీగా తరలివచ్చారు పవన్ కల్యాణ్. మధ్యాహ్నం పవన్ ప్రయాణం ప్రారంభమైతే.. సభకు చేరే సరికి రాత్రి 10 అయింది. అంటే, ఎంత నిదానంగా, ఎంత భారీగా జనసేనాని ర్యాలీ జరిగిందో. వేలల్లో అభిమానులు తరలివచ్చారు. బైక్లు, కార్లతో.. విజయవాడ-మచిలీపట్నం మార్గం మొత్తం జనసైనికులతో కిక్కిరిసిపోయింది.
ఇంత అట్టహాసంగా పవన్ ర్యాలీ చేపట్టినా.. పోలీసులు చంద్రబాబుకు సృష్టించినట్టు అడ్డంకులేవీ క్రియేట్ చేయలేదు. జీవో నెం.1 చూపిస్తూ.. ర్యాలీకి బ్రేకులు వేసే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా.. పోలీసులే దగ్గరుండి.. ట్రాఫిక్ జాములు కాకుండా.. వారాహికి రూట్ క్లియర్ చేయడం ఆసక్తికర విషయం.
ఎందుకు? టీడీపీ విషయంలో అలా.. జనసేన విషయంలో ఇలా? అనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును అడ్డుకుంటే.. టీడీపీ కాసేపు ఆందోళన చేస్తే.. పోలీసులు చాలా ఈజీగా వారిని కట్టడి చేసేవాళ్లు. కానీ, పవన్ కల్యాణ్ మేటర్లో మాత్రం అలాంటి సాహసం చేయలేకపోయారు. జనసేనానిని అడ్డుకుంటే.. ఎలాంటి రియాక్షన్ వస్తుందో వారికి బాగా తెలుసు. ఒకరా ఇద్దరా.. జనం ప్రభంజనంగా తరలివస్తే.. ఏ పోలీసులు కానీ ఏం చేయగలరు? అందుకే, పైవాళ్లు కూడా ఖాకీలపై ఎలాంటి ప్రెజర్ తీసుకురాలేదని తెలుస్తోంది. వారాహి రోడ్ షో సాఫీగా సాగేలా చేయడం.. రాత్రి 11 గంటల వరకూ మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ సజావుగా జరిగేలా.. పూర్తి స్థాయిలో పోలీసులు సహకరించారు. చంద్రబాబుకు జరిగినట్టు పవన్ మాట్లాడుతుండగా.. కరెంట్ పోవడం.. లైట్స్ ఆఫ్ కావడం.. మైక్ కట్ చేయడం.. గట్రా సీన్లు కనిపించలేదు. పవన్ సభకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
వారాహికి పోలీసులు రెడ్ కార్పెట్ పరచడం.. పవన్ సభ సక్సెస్కు సహకరించడం.. చూస్తుంటే చంద్రబాబులా జనసేనానిని అడ్డుకోవడానికి జగన్ సర్కారు భయపడిందా? అంటున్నారు.