TSPSC: రాజశేఖర్రెడ్డి. ఆరేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడు. నెట్వర్క్ ఎక్స్పర్ట్ కావడంతో TSPSC కంప్యూటర్ల ఐపీ అడ్రసులన్నీ తెలుసు. ఈ విషయం తెలిసిన మరో ఉద్యోగి(ASO) ప్రవీణ్ ఆ ఐపీ గుట్టు పట్టేశాడు. ఐపీ అడ్రస్ ద్వారా TSPSC నెట్ వర్క్లోకి జొరబడి.. సర్వర్ హ్యాక్ చేసి.. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ను కొట్టేశాడు. ఆ పేపర్ ప్రింటవుట్ను రేణుక తదితరులకు పంపించాడు. ప్రవీణ్ 10 లక్షలకు పేపర్ అమ్మాడు.
175 ఏఈ పోస్టులకు దాదాపు 33 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు ఒక రోజు ముందు పేపర్ లీకైనట్టు కమిషన్కు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో పేపర్ లీక్ యవ్వారం అంతా బయటపడింది. ఇందులో టీఎస్పీఎస్సీకి చెందిన మొత్తం ఐదుగురు ఉద్యోగుల ప్రమేయం ఉందని ఇప్పటివరకు గుర్తించారు. వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్రెడ్డి తెలిపారు. పోలీసుల దర్యాప్తులో 9మంది నిందితులుగా తేలింది.
లీగల్ ఒపినీయన్ తీసుకుని పరీక్ష రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని TSPSC ఛైర్మన్ జనార్థన్రెడ్డి చెప్పారు. ఏఈ పరీక్షపై నివేదిక రావాల్సి ఉందని.. అధికారిక నివేదిక వచ్చాక బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
హ్యాక్ అయిన సర్వర్లో ఇంకా అనేక పరీక్షల ప్రశ్నాపత్రాలు ఉన్నాయని.. వాటిని మార్చేసి కొత్త పేపర్లు తయారు చేయిస్తామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు TSPSC ఛైర్మన్. తన పిల్లలు ఎవరూ గ్రూప్-1 పరీక్ష రాయలేదని స్పష్టం చేశారు.
నిందితుడు ప్రవీణ్కు గ్రూప్-1 ప్రిలిమ్స్లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని.. 103 మార్కులే అత్యధికం కాదని.. అసలు అతను క్వాలిఫై కాలేదని చెప్పారు.
కమిషన్లో నమ్మిన వాళ్లే గొంతు కోశారని.. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్ మీట్ పెడుతున్నానని.. వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే మీడియా ముందుకు వచ్చానని అన్నారు TSPSC ఛైర్మన్ జనార్థన్రెడ్డి.
మరోవైపు, పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.