AI for traffic : దేశం ఎంత అభివృద్ధి, కొన్ని రంగాల్లో ఇతర ప్రపంచ దేశాలను దాటి ముందుకు వెళ్లినా.. కొన్ని విషయాలను మార్చడం మాత్రం కష్టంగా మారుతోంది. అలాంటి విషయాల్లో ఒకటి ట్రాఫిక్. రోడ్లు ఎంత విస్తరించినా, హైవే లాంటివి ఏర్పాటయినా కూడా ట్రాఫిక్ అనేది రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ట్రాఫిక్ జామ్స్ను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తునే ఉన్నారు. తాజాగా వారు ఓ కొత్త పద్ధతిలో దీనిని కంట్రోల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించని రంగం అంటూ ఏదీ లేదు. వైద్య రంగం దగ్గర నుండి రోజూవారీ ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ వరకు ఏఐ లేని చోటంటూ లేదు. అందుకే ట్రాఫిక్ విషయంలో కూడా ఏఐ సాయం తీసుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇండియాలో అత్యంత ట్రాఫిక్ ఉన్న సిటీ ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది బెంగళూరు. అందుకే బెంగళూరులోని ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి ఏఐ రంగంలోకి దిగనుంది.
వచ్చే మూడేళ్లలో 363 నుండి 500 వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ను ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టమ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సైంటిఫిక్ పద్ధతిలో ఏఐతో ఏర్పాటు చేసే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇన్నేళ్లకు ట్రాఫిక్ కష్టాలతో బాధపడుతున్న బెంగళూరు ప్రజలకు ఏఐ సిగ్నల్స్తో కాస్త రిలీఫ్ దొరకనుంది.