Kharge : రాహుల్ గాంధీ ఇటీవల లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటిలో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో రచ్చ రేగింది. ఉభయ సభల్లో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. అంత వాడీవేడిగా సాగుతున్న సమావేశాల్లో ఆస్కార్ అవార్డుల అంశం ..సరదాగా నవ్వులు పూయించింది. భారత్కు రెండు ఆస్కార్లు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో సరదా వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ లఘు డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. అవార్డు గ్రహీతలకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండూ దక్షిణాదికి చెందిన చిత్రాలు కావడం తమకెంతో గర్వకారణమన్నారు. ఈ అవార్డుల క్రెడిట్ను అధికార పార్టీ తీసుకోకూడదనేదే తన విజ్ఞప్తి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు రావడం గర్వకారణమని ఖర్గే అన్నారు. అయితీ దీనికి అధికార పార్టీ క్రెడిట్ తీసుకోకూడదన్నారు. మేమే దర్శకత్వం వహించాం.. మేమే రాశాం.. ప్రధాని మోదీ దర్శకత్వం వహించారు.. ఇలా అనొద్దు. అదొక్కటే నా అభ్యర్థన. ఇందులో దేశ సహకారం ఉందని ఖర్గే అన్నారు.
ఖర్గే వ్యాఖ్యలపై విపక్ష నేతలే కాకుండా, అధికార పార్టీ సభ్యులు సరదాగా నువ్వుకున్నారు. ఖర్గే మాట్లాడుతున్న సమయంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నవ్వుతూ కనిపించారు. అంతకుముందు పీయూష్ గోయల్ సైతం ఆస్కార్ విజేతలను అభినందించారు. ఆర్ఆర్ఆర్ చిత్ర రచయిత పార్లమెంట్ సభ్యుడని విజయేంద్ర ప్రసాద్ పేరును ప్రస్తావించారు. ఆయన సహకారాన్ని గుర్తించాలన్నారు. మొత్తంమీద గరగరంగా సాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆస్కార్ అవార్డుల అంశం సరదా వాతావరణాన్ని సృష్టించింది.