AP Cabinet : ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. సంక్షేమ పథకాలు గెలుపిస్తాయన్న ధీమాతో ఉన్న సీఎం జగన్ “వై నాట్ 175′ నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఎమ్మెల్యేలందర్నీ ఇంటింటికి తిరగమంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించమంటున్నారు. లబ్ధిదారులకు జరిగిన మేలును చెప్పమంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.
నెలకోసారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారు. పనితీరు బాగోలేని నేతలకు నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. పనితీరు బాగోలేకుంటే టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం.. కేబినెట్ సమావేశం నిర్వహించారు . 45 అజెండా అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఆమోదం తెలిపింది కేబినెట్. కొత్త ఇండస్ట్రియల్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023-27 పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కేబినెట్ సమావేశంలోనే కొందరు మంత్రులకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అందరి పనితీరును గమనిస్తున్నానని చెప్పారు. మంత్రివర్గంలో మార్పులు తప్పవని హెచ్చరించారు. శాఖాపరంగా, పనితీరు ఆధారంగా మార్పులుంటాయని సంకేతాలు ఇచ్చారు.
ఇద్దరు, ముగ్గురుని మార్చే అవకాశం ఉందని సీఎం జగన్ స్పష్టతనిచ్చారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్థానంలో కవురు శ్రీనివాస్ కు స్థానం దక్కుతుందని తెలుస్తోంది. దాడిశెట్టి రాజా స్థానంలో తోట త్రిమూర్తులకు అవకాశం ఇస్తారని సమాచారం. మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కావడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే జగన్ తన తొలి కేబినెట్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను మంత్రివర్గం తప్పించి రాజ్యసభ సభ్యులుగా పంపారు. ఎందుకంటే అప్పుడు శాసనమండలి రద్దు చేయాలని నిర్ణయించారు. పిల్లి బోస్ , మోపిదేవి అప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్నారు.
ఏడాది క్రితం జగన్ మంత్రివర్గాన్ని మార్చారు. కొడాలి నాని, పేర్ని నాని , వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు ఇలాంటి గట్టిగా మాట్లాడే నేతలను మంత్రివర్గం నుంచి తప్పించారు. అదే సమయంలో తొలి నుంచి వెన్నుదన్నుగా ఉన్న అంబటి రాంబాబు, రోజా, జోగి రమేష్ లాంటి నేతలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మంత్రివర్గంలో కొందర్ని తొలిగించే యోచనలో జగన్ ఉన్నారని తాజాగా కేబినెట్ మీట్ లో ఇచ్చిన వార్నింగ్ తో తేలిపోయింది. అంటే కొందరు మంత్రులపై వేటు పడటం ఖాయమని స్పష్టమైంది. ఊహాగానాలు ఎలా ఉన్నా వాస్తవంగా ఎవరెవరిపై వేటు పడుతుంది? కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి..?