CM Jagan : విశాఖపట్నం నుంచే పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తొలుత ఉగాది నుంచి వైజాగ్ కు షిప్ట్ అవ్వాలని భావించారు. అయితే అమరావతిపై పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదు. ఇప్పటికే ఈ విషయంపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. మరి ఏపీ ప్రభత్వం వెనక్కి తగ్గిందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ ఇష్యూ జనంలోకి వెళ్లకముందే గంటల వ్యవధిలోనే సీఎం జగన్ రాజధాని తరలింపుపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమాశాల నేపథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టతనిచ్చారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వైజాగ్ నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తామని ఢిల్లీలోనే ప్రకటించారు. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. విశాఖ కేంద్రం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో విశాఖ రాజధాని అని అటు సీఎం జగన్, ఇటు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుకోసమే ప్రభుత్వం వేచిచూస్తోంది. తీర్పురాగానే అధికారికంగా రాజధాని తరలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.