JanaSena: జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభకు మచిలీపట్నం వేదికైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. బందరు శివారులో 35 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం , 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. LED స్క్రీన్లతో పది గ్యాలరీలు సిద్ధం చేశారు. పార్టీ అధినేత పవన్కల్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు సభ జరుగనుంది.
పవన్కు విజయవాడ-బందరు మధ్య దారి పొడవునా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయం వద్ద 100 అడుగుల ఎత్తు పార్టీ జెండాని నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పదో ఆవిర్భావ సభ కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు పోలీసుల అనుమతి కూడా లభించిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదే మిగిలి మిగిలి ఉండటంతో.. ఈ సభ నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పొత్తులపై, ఎన్నికల కార్యచరణపై ఎలాంటి ప్రకటన చేస్తారో అని ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
మచిలీపట్నం వరకూ ముఖ్యమైన కూడళ్లలో స్థానికుల్ని కలుస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉన్నందున.. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నాయకులు, శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. పొత్తులు సహా వివిధ అంశంపై పార్టీ వైఖరిని పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన పార్టీ 9వ ఆవిర్భావ సభలోనే.. విపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని పవన్ ప్రకటించారు. అదే విధానానికి కట్టుబడి ఉన్నట్లు ఆ తర్వాత కూడా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. కొన్ని నెలల క్రితం విజయవాడలో పవన్తో భేటీ అయ్యారు. మరికొన్ని రోజులకు హైదరాబాద్లో చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారు.
విపక్షాల ఓట్లు చీలకూడదన్న పవన్ ప్రకటనలపై ఆయా భేటీల్లో చర్చ జరిగినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి నడవాలని ఇద్దరు నేతలు అవగాహనకు వచ్చారు. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ.. ఉమ్మడి కార్యాచరణ లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ విధానం ఏంటన్నది.. ఇవాళ్టి సభలో పవన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపుల సంక్షేమంపై కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ సారథ్యంలో 2014 మార్చి 14న పురుడు పోసుకున్న జనసేన.. ఒడుదొడుకుల్ని తట్టుకుని ముందుకు సాగుతోంది. పార్టీ పుట్టిన కొన్నాళ్లకే ఎన్నికలు రావడంతో అప్పట్లో పోటీకి దూరంగా ఉన్నా… తెలుగుదేశం, బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చారు. ఆ తర్వాత కూడా కూటమితో కలిసి సాగిన ఆయన.. 2019 ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలకు దూరం జరిగారు. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలవగా.. పార్టీ పరాజయం పాలైంది. పవన్ కల్యాణ్ స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు. పార్టీ తరపున రాపాక వరప్రసాద్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మళ్లీ బీజేపీతో జట్టు కట్టిన పవన్.. నాలుగేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తున్నారు.
ఇసుక కొరతపై ఉద్యమించారు. ఉపాధి కోల్పోయిన కూలీల కోసం కొన్ని రోజులు ఆహార కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు, రోడ్ల దుస్థితిపై నిరసలకు దిగారు. అమరావతి నుంచి రాజధాని మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సాగు గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు.. లక్ష రూపాయలు చొప్పున సాయం అందజేశారు. పార్టీ 9వ ఆవిర్భావ సభకు స్థలమిచ్చిన ఇప్పటం గ్రామస్థులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగినప్పుడు.. వారికి అండగా నిలిచారు. వైసీపీ ఆగడాలు, ఆ పార్టీ నేతల కబ్జాలు, మహిళలపై అకృత్యాలు, గంజాయి రవాణా సహా వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు గట్టిగా గళం వినిపిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంపై విమర్శలు, దూషణలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో.. ఇప్పుడిక అసలుసిసలు రాజకీయ యుద్ధానికి దిగుతున్నారు. మచిలీపట్నం ఆవిర్భావ సభలో కీలక అంశాలు ప్రస్తావించనున్నారు.
CM Jagan : విశాఖ నుంచి పాలన పక్కా.. ఎప్పటినుంచంటే?.. సీఎం జగన్ క్లారిటీ..