AP Capitals : విశాఖపట్నం కేంద్రంగా పారిపాలన చేస్తామని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో పదే పదే ప్రకటనలు చేస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ముందు త్వరలోనే విశాఖకు పాలన తరలిస్తామని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. విశాఖ రాజధాని కాబోతోందని స్పష్టతనిచ్చారు. సీఎం కార్యాలయాన్ని వైజాగ్ కు తరలిస్తామని ప్రకటించారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకేశారు. ఏపీకి ఒక్కటే రాజధాని అని అది విశాఖపట్నమేనని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో అలజడి రేగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశాయి.
ప్రతిపక్షాల నిరసనల తర్వాత వైసీపీ ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని తెలిపారు. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని మరోసారి పాతపాట అందుకున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో గందరగోళ పరిస్థితులను సృష్టించింది.
గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానులు అంశాన్ని తప్పకుండా ప్రభుత్వం ప్రస్తావించేది. కానీ ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో పాలనా వికేంద్రకరణ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదు. 3 రాజధానుల ఏర్పాటు గురించి గవర్నర్ చెప్పలేదు.
గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడానికి కారణం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉండటమేనని తెలుస్తోంది. అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు త్వరలోనే రానుంది. అందుకే 3 రాజధానుల అంశాన్ని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదని తెలుస్తోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఏపీ ప్రభుత్వం రాజధానిపై ముందడుగు వేస్తుందా..?
JanaSena: పవన్ ప్రసంగంపై ఫుల్ అటెన్షన్.. జగన్కు ఝలక్ తప్పదా?
CM Jagan : విశాఖ నుంచి పాలన పక్కా.. ఎప్పటినుంచంటే?.. సీఎం జగన్ క్లారిటీ..