Governor : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే రచ్చ మొదలైంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. నీటిపారుదల రంగంపై గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఎలాంటి పురోగతి లేదని నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ప్రాజెక్టులను పూర్తి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలవరం, వెలుగొండ ప్రాజెక్ట్లో పురోగతి, 54 ఇరిగేషన్ ప్రాజెక్ట్ల్లో 14 పూర్తి చేశామని గవర్నర్ తెలిపారు. దీంతో అసత్యాలు భరించలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గవర్నర్ వెయిట్.. వెయిట్ అంటూ ఇరు పార్టీల సభ్యులను శాంతిపజేశారు. గవర్నర్ చేత అసత్యాలు చెప్పిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని యథావిధిగా కొనసాగించారు.
ఏపీలో ఇవే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ సెషన్ సమావేశాలు చాలా కీలకం కానున్నాయి. మొత్తం 9 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 16న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 22న ఉగాది రోజు సభకు సెలవు. ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించింది. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఈ అంశాలనే గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చారు. బడ్జెట్ లో సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇస్తారని అంచనా ఉంది.
అటు ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ను ప్రభుత్వంపై దాడికి ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అందుకే సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని పట్టుబట్టింది. మొత్తం 20 అంశాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో టీడీపీ కోరింది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న వ్యూహంతో టీడీపీ ఉంది. అందుకే గవర్నర్ ప్రసంగంతో టీడీపీ నిరసనలు మొదలుపెట్టింది.
గవర్నర్ ప్రసంగంపై జరిగే చర్చలో టీడీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని ఏడాదిన్నర క్రితమే శపథం చేసి అప్పట్లో సభ నుంచి వెళ్లిపోయారు. గత సెషన్ లో టీడీపీ సభ్యులు పదే పదే నిరసనలు తెలుపుతూ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈసారి టీడీపీని వైసీపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? సీఎం జగన్ వ్యూహమేంటి? ఈసారి సమావేశాల్లో కూడా రచ్చ తప్పదా..?
TSPSC: గ్రూప్-1 పేపర్ కూడా లీక్?.. ప్రవీణ్ ఫోన్లో అమ్మాయిల నగ్న ఫొటోలు..