BJP: బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. కాంగ్రెస్లా కుమ్ములాటలు తక్కువే. ఇదంతా ఒకప్పటి మాట. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక.. కాషాయంలోనూ గ్రూపులు తయారయ్యాయి. రహస్య మీటింగులు పెరిగాయి. అధిష్టానం వరకూ ఆ విషయం వెళ్లింది. అయినా, పైకి కామ్గా కనిపిస్తున్నా.. లోలోన కుంపటి రగులుతూనే ఉందంటున్నారు.
బీజేపీలో అనేక గ్రూపులు ఉన్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ధర్మపురి అర్వింద్, రఘునందన్రావు, మురళీధర్రావు.. ఇలా ఎవరికి వారే..అంటారు. అప్పుడప్పుడు ఆ కుంపట్లు ఎగిసిపడుతుంటాయి.
లేటెస్ట్గా ఎమ్మెల్సీ కవిత కారణంగా కమలంలో మళ్లీ కల్లోలం చెలరేగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళను ఉద్దేశించి బండి అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ నేతలే తప్పుబడుతున్నారు. ఆ పార్టీ ఎంపీ అర్వింద్.. బండి టార్గెట్గా సంచలన కామెంట్లు చేశారు.
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని.. ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాలని అర్వింద్ అన్నారు. తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయని.. వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఏకంగా పార్టీ చీఫ్కే సూచనలు చేయడం పార్టీలో కలకలం రేపింది. అంతటితో ఆగని అర్వింద్.. రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని.. కేవలం కో ఆర్ఢినేటర్ సెంటర్ మాత్రమేనంటూ బండి సంజయ్ పవర్ను తుస్సుమనిపించేలా మాట్లాడారు.
బండికి అర్వింద్కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే విషయం ఈ వ్యాఖ్యలతో బహిరంగమైంది. అర్వింద్ వ్యాఖ్యలను కొందరు బీజేపీ నేతలు సమర్థిస్తుంటే.. ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏం మాట్లాడాలో పార్టీ అధ్యక్షునికి తెలుసంటూ.. బండికి సపోర్ట్ చేశారు. మీడియా ముందు అర్వింద్ అలా మాట్లాడటం తప్పని మండిపడ్డారు రాజాసింగ్.
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. ఇద్దరూ ఇద్దరే. పదునైన విమర్శలు చేస్తుంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఆ దూకుడే వారికి ప్రజల్లో మరింత క్రేజ్ తీసుకొచ్చింది. పార్టీ అధ్యక్షునిగా బండి ఇమేజ్ని మరింత పెంచింది. ఎంపీగా అర్వింద్కు పాపులారిటీ తీసుకొచ్చింది. అయితే, నోటి దురుసుతనం ఉన్న అర్విందే.. బండి సంజయ్ను తప్పుబట్టడం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదంటూ చేసిన కామెంట్.. యథాలాపంగా చేసింది కాదని.. ఆయనపై ఉన్న వ్యతిరేకతే ఇలా మాట్లాడేలా చేసిందనే చర్చ నడుస్తోంది. ఇప్పుడైతే అర్వింద్ బయటపడ్డారు.. ఎన్నికల నాటికి నేతల మధ్య కోల్డ్వార్ ఇంకెంత ముదురుతుందో? అయితే, బండి సంజయ్కి అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో.. ఇప్పట్లో బండి పోస్టుకు వచ్చే ప్రాబ్లమ్ ఏమీ ఉండకపోవచ్చు.