Plants : ఈరోజుల్లో ఎక్కడ చూసినా కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందుకే దానికి దూరంగా జీవించాలి అని ఆశపడే వారు కూడా ఉన్నారు. అలా కాకుండా కాలుష్యానికి మధ్యలో తమకంటూ ఒక పచ్చదనాన్ని సృష్టించుకొని జీవించేవారు కూడా ఉన్నారు. వారే పర్యావరణ ప్రేమికులు. మొక్కలు పెంచడం ఇలాంటి వారికి బాగా ఇష్టం. అయితే మొక్కల పెంపకం గురించి శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
మొక్కలను పెంచడం అంత సులువైన పని కాదని.. అందరూ అంటుంటారు. కానీ మొక్కలను ప్రేమించే వారు మాత్రం మనసుతో చేస్తే ఇది చాలా సులువైన పనే అని సలహా ఇస్తున్నారు. అయితే మొక్కలను పెంచాలంటే వాటికి సరైన సన్లైట్ వస్తుందా లేదా చూడడం, వాటికి సరిపడా నీళ్లు అందించడం.. ఇవి మాత్రమే సరిపోవని పరిశోధకులు చెప్తున్నారు. వీటితో పాటు మొక్కలతో ముచ్చట్లు కూడా పెట్టాలట. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా మొక్కల పెంపకం విషయంలో ఇది కూడా ఒక భాగమే అని వారు అంటున్నారు.
ఏమైనా కబుర్లు చెప్పాలి అనుకునే సమయంలో మాట్లాడడానికి ఎవరూ తోడు లేకపోవడం మానసికంగా మనిషిని మరింత బలహీనంగా చేస్తోంది. అలా కాకుండా మీకు మొక్కలు పెంచుకునే అలవాటు ఉంటే.. వాటితో కబుర్లు చెప్పడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అంతే కాకుండా తాజాగా ఒక సర్వేలో ఈ విషయం నిరూపణ కూడా అయ్యింది. 1,250 మొక్కల ఓనర్లలో సగం మందికి మొక్కలతో కబుర్లు చెప్పే అలవాటు ఉందని సర్వేలో తేలింది.
మొక్కల ప్రేమికులు.. వాటితో కబుర్లు చెప్పడం ద్వారా అవి ఆరోగ్యంగా పెరుగుతాయని కూడా నమ్ముతారు. అయితే మొక్కలతో మాట్లాడడం ఏంటి అని కొందరు వింతగా చూస్తారు. కానీ మొక్కలు కూడా జీవరాశులలో ఒకటని, ఇతర జీవరాశులలాగానే అవి కూడా పర్యావరణానికి స్పందిస్తాయని పర్యావరణవేత్తలు సమాధానమిస్తున్నారు. అందుకే మొక్కలు పెరగడానికి వాటి చుట్టూ వాటికి నచ్చిన శబ్దాలు ఉంటే.. అవి మరింత ఆరోగ్యంగా పెరుగుతాయని వారు చెప్తున్నారు.