Revanth Reddy: కాంగ్రెస్ ఖేల్ ఖతం అని ప్రచారం జరుగుతోంది. రేవంత్రెడ్డి మాత్రం ఆ పార్టీకి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. పాదయాత్రలతో ఇప్పుడిప్పుడే కేడర్లో జోష్ పెరుగుతోంది. అయితే, ఎవరికివారే యాత్రలు చేస్తూ.. కాంగ్రెస్ అంటే అంతేనని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు. ఇలాగైతే బీఆర్ఎస్, బీజేపీలను ఢీ కొట్టేదెలా? అనే చర్చ నడుస్తోంది.
విపక్షంగా బీజేపీ మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వ అండాదండా గట్టిగా ఉండటంతో.. కమలనాథులు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్తో సై అంటే సై అంటున్నారు. ఢిల్లి లిక్కర్ స్కాంలో కవితను ఈడీ అరెస్ట్ చేస్తే.. బీజేపీది మరింత అప్పర్ హ్యాండ్ అవ్వొచ్చు.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ మరింత వేగంగా దూసుకురావాల్సిన అవసరం ఉంది. పార్టీ నుంచి వలసలే కానీ, చేరికలు లేకుండా నిరుత్సాహంగా ఉంది పార్టీ. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో.. చేతి రేఖలు సరిదిద్దాల్సిన సమయం రానే వచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే నెంబర్ 2గా ఉందని అన్నారు టీపీసీసీ చీఫ్. పార్టీలో చేరికలపైనా దృష్టి పెట్టారు. బీజేపీని దెబ్బ కొట్టేలా అడుగులు వేస్తున్నారు. కమలం పార్టీలో ఫుల్ యాక్టివ్గా ఉండే ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్కు మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం జరుగుతోంది. హస్తం పార్టీలో సుదీర్ఘ చరిత్ర ఉన్న డీఎస్.. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీఆర్ఎస్లో చేరి రాజ్యసభ ఎంపీ పదవి సాధించారు. కారులో ఉంటూనే.. స్థానికంగా బీజేపీకి మద్దతిస్తున్నారంటూ ఆయన్ను పక్కన పెట్టారు గులాబీ బాస్. అర్వింద్ బీజేపీలో ఉన్నా.. డీఎస్ మాత్రం కాంగ్రెస్పైనే మక్కువగా ఉన్నారట. ఇప్పటికే రెండుసార్లు సోనియాగాంధీని కూడా కలిశారని.. త్వరలోనే ఆయన కాంగ్రెస్లో చేరుతారని తెలుస్తోంది.
ఈ విషయంపై రేవంత్రెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు. పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటే కచ్చితంగా కొత్తవారిని చేర్చుకుంటామని అన్నారు. డీఎస్ చేరిక అధిష్టానం పరిధిలో ఉందన్నారు. త్వరలోనే పలువురు ప్రముఖ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెప్పారు. వైఎస్సార్ హయాంలో సుదీర్ఘ కాలం పీసీసీ చీఫ్గా ఉన్న డీఎస్.. మళ్లీ కాంగ్రెస్లో చేరితే పార్టీకి మరింత బలం వస్తుందా? అంటే డౌటే అంటున్నారు. డీఎస్ వయోభారంతో బాధపడుతున్నారు. శారీరకంగా, రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. మరి, డి.శ్రీనివాస్తో పార్టీకి ప్రయోజనం ఏంటి? అంటే ఉందంటున్నారు.
బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉన్నారు ఎంపీ అర్వింద్. అలాంటి అర్వింద్ తండ్రి.. బీజేపీలో కాకుండా కాంగ్రెస్లో చేర్చుకుని.. కమలనాథుల నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలనేది రేవంత్ స్కెచ్. బీజేపీ కంటే కాంగ్రెస్ ఎందులోనూ తక్కువ కాదనేలా మెసేజ్ ఇచ్చినట్టు కూడా అవుతుందని భావిస్తున్నారు. అందుకే, డీఎస్తో ఎంత లాభం అని చూడకుండా.. బీజేపీ ఎంపీ తండ్రి కాంగ్రెస్లో చేరారనే టాక్ కోసమే ఆయనకు వెల్కమ్ చెబుతున్నారని అంటున్నారు.
ఇక, రాబోయే ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ పై ఫోకస్ పెట్టామని.. అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగానే టికెట్లు ప్రకటిస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. ఇది కూడా మంచి ప్రయోగమే. ఆఖరి క్షణంలో టికెట్లు ప్రకటిస్తే.. అసంతృప్తులంతా రెబెల్గా రంగంలోకి దిగి విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే, ముందుగానే అభ్యర్థిని ప్రకటించేస్తే.. టికెట్ వస్తుందో రాదోననే అనుమానం లేకుండా.. ఇప్పటినుంచే గట్టిగా ప్రచారం చేసుకుపోతారు. అది పార్టీకి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. రేవంత్రెడ్డి మళ్లీ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రజలు కేసీఆర్ను పట్టించుకోవడం మానేశారని..రాష్ట్రంలో బీజేపీ కూడా బలంగా లేదని.. బీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదని.. పదే పదే ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్లో ఉత్సాహం నింపుతున్నారు రేవంత్రెడ్డి. ఈ జోష్కు చేరికలు కూడా తోడైతే.. మరింత దూకుడుగా ఎన్నికలకు వెళ్లొచ్చని భావిస్తున్నారు.