kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో రామచంద్ర పిళ్లైకి మరో మూడు రోజుల ఈడీ కస్టడీని విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈనెల 16 వరకు ఆయన ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కీలక సమయంలో పిళ్లై స్టేట్మెంట్ వెనక్కు తీసుకున్నారని ఈడీ వాదించింది. అతనిని తాము భయపెట్టడం కానీ, బలవంతం చేయడం కానీ చేయలేదని.. విచారణ మొత్తం వీడియో, సీసీకెమెరాల్లో రికార్డు చేశామని కోర్టుకు తెలిపింది ఈడీ. కవితకు నోటీసులు ఇవ్వగానే పిళ్లై తన వాంగ్మూలాన్ని విత్డ్రా చేసుకోవడం వెనుక అర్థం ఏంటో తెలిసిపోతోందని అన్నారు. బుచ్చిబాబుతో కలిపి పిళ్ళైని విచారించాల్సి ఉందని కోర్టు దృష్టికి ఈడీ అధికారులు తీసుకొచ్చారు. ఈ నెల 15న హాజరుకావాలని ఆడిటర్ బుచ్చిబాబుకు నోటీసులు ఇచ్చారు.
రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు. ఇద్దరూ కవిత కేసులో కీలకంగా ఉన్నారు. పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ వాదన. బుచ్చిబాబు, కవిత దగ్గర ఆడిటర్గా పని చేశాడు. ఇలా పిళ్లై, బుచ్చిబాబులను విచారణలో ఎంతగా ఫిక్స్ చేస్తే.. కవితను లాక్ చేయడానికి మరింత స్కోప్ పెరుగుతుంది ఈడీకి. అందుకే, రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబుల ఎంక్వైరీ.. కవితకు మరిన్ని కష్టాలు తీసుకొచ్చేలా ఉన్నాయి.
ఇప్పటికే ఓ దఫా కవితను ప్రశ్నించింది ఈడీ. 16న మరోసారి ఎంక్వైరీ ఉంది. శనివారమే కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ సైతం అరెస్ట్ చేస్తారని చెప్పారు. కానీ, ఎందుకోగాని కవితను వదిలేసింది ఈడీ. కాకపోతే మళ్లీ విచారణకు పిలిచింది. ఈసారి అరెస్ట్ పక్కా అంటున్నారు. మరింత పకడ్బందీగా కేసులో ఉచ్చు బిగించేందుకే.. గడువు ఇచ్చారని తెలుస్తోంది. పిళ్లైను మరోసారి కస్టడీకి తీసుకోవడం, బుచ్చిబాబుతో కలిపి విచారించనుండటం.. వారిద్దరికీ కవితతో ఉన్న లింకులను బయటకు లాగడం.. ఈడీ దూకుడు చూస్తుంటే ఈసారి కవిత అరెస్ట్ తప్పకపోవచ్చని అంటున్నారు.