Cyber Crime: ఉదయం లేసినప్పుడు మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు మనకు చాలా కాల్స్ వస్తుంటాయి. అందులో ఎక్కువగా బ్యాంక్ లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తామని, బహుమతులు గెలుచుకున్నారని ఫేక్ కాల్స్ చేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఆ మాటలు నమ్మి వాళ్ల వలలో పడ్డామా.. ఇక అంతే సంగతి. క్షణాల్లో మన ఖాతాను ఖాలీ చేసేస్తారు. తాజాగా ముంబైకి చెందిన ఓ యువతి ఓ వ్యక్తి మాటలు నమ్మి ఏకంగా రూ. ఏడు లక్షలు పోగొట్టుకుంది.
ముంబైకి చెందిన ఓ యువతికి సౌరభ్ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ఆమెకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేశాడు. అయితే ఆఫర్ నచ్చడంతో యువతి క్రెడిట్ కార్డు తీసుకునేందుకు రెడీ అయిపోయింది. కార్డు కోసం తన ఆధార్ కార్డును శర్మకు వాట్సాప్ ద్వారా పంపించింది. అనంతరం శర్మ ఓ లింకును యువతి ఫోన్కు పంపించి.. ఆండ్రాయిడ్ పోన్లో ఈ లింక్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు ప్రాసెస్ చేయాలని సూచించాడు.
అయితే యువతి దగ్గర యాపిల్ ఫోన్ ఉండడంతో ఆమె ఇంటికి శర్మ ఓ ఆండ్రాయిడ్ ఫోన్ను పంపించాడు. అప్పటికే ఆ ఫోన్లో డాట్ సెక్యూర్, సెక్యూర్ ఎన్వాయ్ అథెంటికేషన్ అనే రెండు యాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ యువతి శర్మ పంపించిన లింక్ను ఆఫోన్లో ఓపెన్ చేసి అతడు చెప్పినట్లుగా ప్రాసెస్ చేసింది.
వారం రోజుల్లో ఇంటికి క్రెడిక్ కార్డ్ వస్తుందని శర్మ యువతిని నమ్మించాడు. గంట తర్వాత యువతి అకౌంట్ నుంచి రూ. 7 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఆమె ఫోన్కు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె బ్యాంక్కు వెళ్లి ఎంక్వైరీ చేయగా.. బెంగళూరులోని ఓ జ్యూవెల్లరీ షాపులో ఈ లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో మోసపోయానని గుర్తించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.