CBI: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. వివేకా హత్య కేసు డైరీని షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది సీబీఐ. 35 మంది సాక్షుల స్టేట్మెంట్లు, 10 డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను కోర్టుకు అందజేసింది. స్పాట్ లో దొరికిన లెటర్తో పాటు FSL నివేదికను కూడా కోర్టుకు సమర్పించింది.
కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ పాత్ర ఉందని.. ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెలడయ్యే వరకూ అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశించింది.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై సీబీఐకు అప్లికేషన్ పెట్టుకోవాలని కోర్టు సూచించింది.
సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయటంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో సంబంధిత అంశాలను మాట్లాడకూడదని హెచ్చరించింది.
మరోవైపు.. సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తముందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది అన్నారు. సునీత అభియోగం వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివేకా హత్య జరిగి.. ఏడాది జరిగాక సునీత ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేక రెండో భార్య షమీం పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని అవినాష్ తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు జరగాలని కోరారు.
హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో.. అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది.