God’s service : ఏ గుడికి వెళ్లినా ముందుగా గుడి ముందున్న ధ్వజస్తంభాన్ని తాకకుండా వెళ్లరు. ఆలయ మూలవిరాట్ ను చూడరు. అంతటి ప్రాధాన్యం గల ధ్వజస్తంభానికి వాడే నారేప వృక్షాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వృక్షాలు ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో మాత్రమే దర్శనమిస్తాయి. కొత్తగా ఆలయాల నిర్మాణం చేపడుతున్న భక్తులు ధ్వజస్తంభం ప్రతిష్టాపన కర్ర కోసం ఈ ప్రాంతానికి రావాల్సిందే.
ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. ఇంత విశిష్టత ఉన్న ధ్వజస్తంభాన్ని నారేప చెట్టు నుంచి తయారు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకున్న వృక్షాన్ని సంస్కృతంలో అంజనా అని పిలుస్తారు. దేవాలయం ముంగిట ధ్వజస్తంబాన్ని నిలబెట్టడం పూర్వకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఎండా,వాన వచ్చినా ఈ కర్రకు ఏ మాత్రం చెదలు పట్టదు. ఉక్కుతో సమానంగా ఈ చెట్టు కర్ర బలంగా ఉంటుంది. ఒక్క సారి దేవాలయాన్ని నిర్మించారంటే దశాబ్దాలపాటు ఆధ్యాత్మికతను ఎలా పంచుతుందో అలాగే ఆలయం ఎదుట సాక్షాత్కారించే ధ్వజస్తంభం సైతం అంతే పటిష్టంగా, చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ వృక్షజాతి కర్రను వాడుతారు. ఎన్ని విపత్తులు ఎదురైనా తట్టుకునే శక్తి ఈ చెట్టుకున్న లక్షణం.
తక్కువ కొమ్మలతో నిటారుగా పెరుగుతుంది. నారేప వృక్షం 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కాండం చాలా గట్టిగా ఉంటుంది. జిగురు ఎక్కువగా ఉండడంతో గట్టిగా ఉంటుంది. యంత్రాల సహాయంతో ఈ చెట్టును కోయడం కూడా కష్టంతో కూడుకున్న పనే ఎండకు, వానకు తట్టుకొని నిలబడుతుంది. ఆలయ పూజారులు ధ్వజస్తంభం కోసం నారేప చెట్లను సిఫార్సుచేస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల దేవాలయాలకు ఇక్కడి నారేప వృక్షాలను తీసుకెళతారని స్థానికులు చెపుతున్నారు. నారేప చెట్టు చెక్కను అత్యుత్తమ నాణ్యత, తెగులు నిరోధక మరియు అత్యంత స్థిరమైనదిగా పరిగణిస్తారు. దేవాలయం నిర్మాణానికి సంబంధించిన ఆధారాలను చూపించి ఈ చెట్టును తీసుకెళ్లాలని అధికారులు అంటున్నారు.