WTC Final : ఆ మ్యాచ్ రిజల్ట్ కోసం 4 దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ మ్యాచ్ కూడా ఆద్యంతం ఆసక్తిగానే సాగింది. నరాలు తెగే ఉత్కంఠ. చివరి బంతికి ఫలితం . అది వన్డే మ్యాచ్ కాదు. అలాగని టీ20 మ్యాచ్ అసలే కాదు. ఇది టెస్టు మ్యాచ్. ఐదోరోజు ఆఖరి బంతికి ఫలితం వచ్చింది. దీంతో భారత్ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అలాగని ఈ మ్యాచ్ లో గెలిచింది భారత్ కాదు న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తే భారత్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారేవి. అందుకే కివీస్ విజయంతో భారత్ అభిమానులు ఖుషీ అయ్యారు.
లంక ఓటమితో భారత్ ఫైనల్ బెర్త్ ఖాయమైంది. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి జరిగే తుదిపోరులో భారత్ ఆస్ట్రేలియాతో ఢీకొంటుంది. తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ , న్యూజిలాండ్ తలపడ్డాయి. టీమిండియాను ఓడించి కివీస్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ సారి ఆ జట్టు ఫైనల్ కు చేరే అవకాశాలు అడుగంటినా.. శ్రీలంకపై గెలిచి భారత్ ను ఫైనల్ కు పంపింది.
మ్యాచ్ సాగిందిలా..!
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 355 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులు చేసి 18 రన్స్ లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 302 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 285 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన న్యూజిలాండ్ ఒక దశలో 90 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో డారెల్ మిచెల్ రెండో ఇన్నింగ్స్ లోనూ అద్భుతంగా ఆడాడు.
కేన్ మామ హీరో..
తొలి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు మాత్రమే చేసిన సీనియర్ ఫ్లేయర్ కేన్ విలియమ్సన్ రెండో ఇన్నింగ్స్ లో క్రీజులో పాతుకుపోయాడు. మిచెల్ తో కలిసి 4వ వికెట్ కు 142 పరులకు జోడించి కివీస్ ను విజయం దిశగా తీసుకెళ్లాడు. అయితే విజయానికి చేరువలోకి వచ్చాక కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. చివరకు ఆఖరి బంతికి న్యూజిలాండ్ విజయం సాధించింది. కేన్ విలియమ్సన్ 121 పరుగులతో అజేయంగా నిలిచి కివీస్ ను 2 వికెట్ల తేడాతో గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మిచెల్ కు (102, 81) ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ పరాజయంతో శ్రీలంక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. జూన్ 7న లండన్ ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది.