Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ గేర్ మార్చారు. మార్చి 14 న పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. శనివారమే మంగళగిరి చేరుకుని బీసీలతో సదస్సు నిర్వహించారు. బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆదివారం కాపు సంక్షేమ సేన సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాపు నాయకులు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. పెద్ద కులాలతో గొడవలు వద్దు.. అన్ని కులాలను సమానంగా చూడాలని సూచించారు. కులం నుంచి తాను ఎప్పుడూ పారిపోనని స్పష్టం చేశారు. కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించనని స్పష్టం చేశారు.
2008-09లో జరిగిన ఘటనలు తనలో పంతం పెంచాయని ప్రజారాజ్యం పార్టీ నాటి అనుభవాలను పవన్ గుర్తు చేసుకున్నారు. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రస్తతం కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ఎక్కువయ్యారని తెలిపారు. అందుకే సంఖ్యాబలం ఉన్నా కాపులు అధికారానికి దూరంగా ఉన్నారని చెప్పారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతావారిని తొక్కేస్తారని విషప్రచారం జరిగిందన్నారు. సమాజాన్ని విడగొట్టేవారే ఎక్కువ.. కలిపేవారు తక్కువ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
టీడీపీతో సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారంపై జనసేనాని పరోక్షంగా స్పందించారు. ఎవరితోనూ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను.. నిర్మొహమాటంగానే ఉంటానని తేల్చిచెప్పారు. ఇతర పార్టీల అజెండా కోసం తాము పనిచేయమని అన్నారు. రూ.వెయ్యి కోట్లతో రాజకీయాలు చేయలేమన్నారు. పార్టీని ఇంకా ప్రతికూల పవనాల మధ్యే నడుపుతున్నానని తెలిపారు. కాపులంతా తనకు ఓటేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడిని స్పష్టం చేశారు. పదేళ్లుగా అనేక మాటలు పడ్డానన్నారు. అయినాసరే జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించనని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో రిజర్వేషన్ గురించి మాట్లాడినవారు ఇప్పుడెందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడరా? కాపుల వైపు నిలబడబోమని చెప్పినా ఓటేసి గెలిపించారని .. కుల ఆత్మగౌరవాన్ని చంపుకొని మరీ వైసీపీకి ఎందుకు ఓటేశారు? అని పవన్ నిలదీశారు.
2024 ఎన్నికలు చాలా కీలకమని పవన్ స్పష్టం చేశారు. సంఖ్యాబలాన్ని అనుసరించి సత్తా చాటుకోవాలని కాపులకు పిలుపునిచ్చారు.
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/andhra-pradesh