IND Vs AUS : అహ్మదాబాద్ టెస్టు ఆసక్తికరంగా మారింది. చివరి రోజు మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఓవర్ నైట్ స్కోర్ 289/3 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు జట్టు స్కోర్ 309 పరుగుల వద్ద రవీంద్ర జడేజా (28) వికెట్ ను కోల్పోయింది. తర్వాత కోహ్లీ, కీపర్ శ్రీకర్ భరత్ కలిసి 5వ వికెట్ కు 84 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన భరత్ 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత కోహ్లీ, అక్షర్ పటేల్ జోడి భారత్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఈ జంట ఆరో వికెట్ కు 162 పరుగులు జోడించింది. కోహ్లీ నిదానంగా ఆడితే అక్షర్ పటేల్ రెచ్చిపోయాడు. 113 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు చేశాడు. అయితే 16 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీ 364 బంతుల్లో 15 ఫోర్లతో 186 పరుగులు చేసి 9వ వికెట్ గా అవుట్ అయ్యాడు. వెన్నునొప్పి సమస్యతో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు దిగకపోవడంతో భారత్ ఇన్నింగ్స్ 571 పరుగుల వద్ద ముగిసింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో 91 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ , టాడ్ మర్ఫీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కునెమన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 4వరోజు ఆట ముగిసే సరికి వికెట్లేమి కోల్పోకుండా 3 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (3 బ్యాటింగ్), మథ్యూ కునెమన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను బ్యాటింగ్ కు పంపకుండా స్పిన్నర్ కునెమన్ ను ఆస్ట్రేలియా ఓపెనర్ గా పంపింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించే సమయానికి 4వ రోజు కేవలం ఆరు ఓవర్ల ఆటే మిగిలి ఉండటంతో ఆసీస్ ఈ నిర్ణయం తీసుకుంది.
అద్భుతం జరుగుతుందా..?
అహ్మదాబాద్ పిచ్ పై రోజురోజుకు టర్న్ పెరుగుతోంది. చివరి రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో త్వరగా ఆలౌట్ చేస్తే భారత్ కు విజయావకాశాలుంటాయి. లేదంటే ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయం. మొత్తంమీద భారత్ అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయే పరిస్థితి లేదు. మరి చివరి రోజు భారత్ స్పిన్నర్లు తిప్పేస్తారా..? ఆసీస్ ను ఆలౌట్ చేస్తారా..? చివరి రోజు ఉత్కంఠ ములుపులు ఉంటాయా..?
FOR MORE UPDATES PLEASE FOLLOW :https://bigtvlive.com/sports