MLA Rajaiah : ఆ ఎమ్మెల్యే పై ఓ మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఆ ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. నేరుగా సర్పంచ్ ఇంటికే వెళ్లారు. కానీ ఆ సర్పంచ్ వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్యే వేధించిన మాట వాస్తవమని మరోసారి ఆయన మొహంమీదే కుండబద్దలుకొట్టారు. దీంతో చేసేదేమీ లేక ఆ ఎమ్మెల్యే జరిగిదానికి చింతిస్తున్నానంటూ పశ్చాతాపాన్ని ప్రకటించారు.
ఏం జరిగిందంటే..?
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికం వేధిస్తున్నారని ధర్మాసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచి పూసవల్లి నవ్య రెండురోజుల క్రితం ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో రాజయ్య ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు. నేరుగా సర్పంచ్ నవ్య ఇంటికే వెళ్లారు. అధిష్టానం సూచనతో, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానంతో అక్కడికి వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అధిష్ఠానం తనకు పలు సూచనలు చేసిందని, అందరూ కలిసి పనిచేయాలని చెప్పిందని తెలిపారు. ప్రవీణ్, నవ్య దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత వారితో కలిసి రాజయ్య ప్రెస్ మీట్ పెట్టారు.
చింతిస్తున్నా..
ఇటీవల జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానన్నారు. తాను ఏ ఊరిపట్ల వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలన్నారు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు.
వేధిస్తే తగులబెడతా..
ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యమని సర్పంచ్ నవ్య అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచ్ అయ్యానన్నారు. అయితే రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమన్నారు. దక్కాల్సిన గౌరవం దక్కకుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు. మహిళలపై అరాచకాలు జరిగితే సహించేది లేదని స్పష్టంచేశారు. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకైనా సిద్ధమన్నారు. పార్టీలో తప్పులు జరిగితే ఖండిస్తూనే ఉంటానని సర్పంచి నవ్య స్పష్టం చేశారు.
మహిళా కమిషన్ యాక్షన్..
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఇప్పటికే మహిళా కమిషన్ యాక్షన్కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana