Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కొన్ని దొంగ ఓట్లు నమోదయయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. డిగ్రీ చదవని వాళ్లు కూడా నకిలీ సర్టిఫికేట్లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. పలు చోట్ల అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై బోగస్ ఓట్లను సృష్టించారని ఆరోపించారు.
ఈమేరకు బోగస్ ఓట్లపై సీఈసీకి చంద్రబాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేశారు. తిరుపతిలో 44వ డివిజన్లో చికెన్ షాపు అడ్రస్తో కూడా 16 ఓట్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఫేక్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందన్నారు. తప్పుడు అడ్రస్లతో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని తెలిపారు. బోగస్ ఓట్లు నమోదులో బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా సీఈసీ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇక చంద్రబాబు దొంగ ఓట్లపై సీఈసీకి లేఖ రాయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి టీడీపీ నేతలు సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని బోగస్ ఓట్లను చేర్చిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు.