Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ సుధీర్ఘంగా కొనసాగింది. శనివారం ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఐదుగురు సభ్యుల ఈడీ బృందం ఆమెను ప్రశ్నించారు. అలాగే ప్రస్తుతం వాడుతున్న ఫోన్ అప్పగించాలని కోరారు. ఆ ఫోన్ ఇంటి వద్ద ఉండటంతో కవిత సెక్యూరిటీ సిబ్బందితో ఆ ఫోన్ తెప్పించి ఈడీకి అప్పగించారు. విచారణ మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు భోజన విరామ సమయం ఇచ్చారు.
సాయంత్రం 5 గంటలకు తిరిగి విచారణ కొనసాగించారు. చివరకు రాత్రి 8 గంటలకు కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు. ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని ఆమెను ఈడీ ఆదేశించింది. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో పీఎంఎల్ఏ 50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారని తెలుస్తోంది. ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్టేట్మెంట్ల ఆధారంగా కవితను ఈడీ ప్రశ్నించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించారని సమాచారం. ఆధారాలు ధ్వంసం చేయడం, డిజిటల్ ఆధారాలు లభించకుండా చేయడం లాంటి అంశాలతోపాటు హైదరాబాద్లో జరిగిన సమావేశాలపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో జరిగిన భేటీలపై కూడా ప్రశ్నించారని సమాచారం.
కవిత విచారణ ముగిసే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కవిత ఈడీ విచారణ చేస్తున్న సమయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, పలు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు.
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana