Tihar Jail: కరుడుగట్టిన ఖైదీలను ఉంచే జైలుగా తీహార్ జైలుకు ఎప్పటి నుంచో పేరు ఉంది. అటుంటి జైలులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అధికారులు ఉంచారు. ఈక్రమంలో జైల్లో సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్ బయటపడడం కలకలం రేపుతోంది.
జైలు-3లో ఓ ఖైదీ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో.. అధికారులు అతడిని తనిఖీ చేశారు. అతని వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్, రెండు ఫోన్లు లభ్యమయ్యాయి. అవి జైలుకు ఎలా వచ్చాయి?.. ఎందుకోసం జైలుకు తీసుకొచ్చారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే కరుడుగట్టిన ఖైదీలను ఉంచే జైలులో మనీశ్ సిసోడియాను ఉంచడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సిసోడియాను హత్య చేయడానికే ఆ జైలులో ఉంచారని.. అక్కడ ఆయనకు ప్రాణహానీ ఉందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈక్రమంలో అధికారులు సిసోడియాను మరో వార్డుకు మార్చారు.
మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను అరెస్ట్ చేయగలరు కానీ.. తనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏం చేయలేరని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులను కూడా బ్రిటీషర్లు జైల్లో పెట్టి వేధించారని.. కానీ వారిలో ఉన్న ఆత్మ స్థైర్యాన్ని తొలగించలేకపోయారని వెల్లడించారు.