Posters: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవితకు మద్ధతుగా.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీజేపీలో చేరకముందు చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫొటోలతో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లను ఏర్పాటు చేశారు.
డిజర్జెంట్ పౌడర్ రిన్ యాడ్లా.. రైడుకు ముందు.. రైడుకు తర్వాత అంటూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది నేతలు ఈడీ, సీబీఐ రైడ్స్ జరగగానే.. కాషాయ పార్టీలో చేరారని పోస్టర్ల ద్వారా విమర్శించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా , అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, ఏపీకి చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే, పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఐటీ, సీబీఐ రైడ్ల తర్వాత కాషాయపు రంగులోకి మారారని.. కానీ ఎమ్మెల్సీ కవిత ఒకేలా ఉన్నారని.. అసలైన రంగులు వెలసిపోవంటూ కవితకు మద్ధతు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ఇంట్రెస్టింగ్గా మారాయి.