West Bengal: ఇద్దరమ్మాయిలకు పరిచయం ఏర్పడి.. అదికాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అంతా బాగానే సాగిపోతుందనుకునే క్రమంలో వారిలో ఓ అమ్మాయికి పెళ్లి జరిగింది. అయితే తన ప్రేయసిని విడిచిపెట్టి ఉండలేక ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయింది. తిరిగి తన ప్రేయసి వద్దకు చేరుకుంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని ఆలిపుర్ద్వారా జిల్లాలో చోటుచేసుకుంది.
ఫలాకా ప్రాంతానికి చెందిన ఆ ఇద్దరు అమ్మాయిలకు కాలేజీలో పరిచయం ఏర్పడింది. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుండగా.. అది కాస్త స్నేహంగా మారింది. కొద్దిరోజులకు అది ప్రేమగా మారి.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. రెండేళ్ల పాటు ఈ వ్యవహారం కొనసాగింది. ఎవరికీ తెలియకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చారు. అయినా కూడా ఓ అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది.
దీంతో వారి తల్లిదండ్రులు ఆమెకు ఓ యువకుడితో పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటికీ.. ఆమె మనసును మాత్రం మార్చలేకపోయారు. బలవంతంగా ఆమె భర్తతో కాపురం చేయలేకపోయింది. ఈక్రమంలో తన ప్రేయసితో కలిసి పారిపోయింది. వారిద్దరూ కొన్ని రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి మాల్దాలోని ఓ హోటల్కు చేరుకున్నారు.
అయితే హోటల్ సిబ్బందికి వారిపై అనుమానం కలిగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వాళ్లను స్టేషన్కు తరలించారు. అయితే తాము మేజర్లమని.. తల్లి దండ్రులు తమ ప్రేమను అంగీకరిస్తేనే ఇంటికి వెళ్తామని వాళ్లు తేల్చి చెప్పేశారు. దీంతో పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందిచ్చారు. తల్లిదండ్రులు స్టేషన్కురావడానికి నిరాకరిస్తుండడంతో వాళ్లు స్టేషన్లోనే ఎదురు చేస్తున్నారు.