Manish Sisodia: మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాది ప్రత్యక్ష పాత్రే అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం కోర్టుకు తెలిపింది. సిసోడియాను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం ఆయన్ను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. మార్చి 17వరకు కస్టడీకి అనుమతించింది కోర్టు.
నిపుణుల కమిటీ అభిప్రాయాలను పక్కనబెట్టి.. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించారని ఈడీ పేర్కొంది. ‘‘కొందరు హోల్సేల్ డీలర్లకు 12శాతం లాభం ఉండేలా పాలసీని తయారు చేశారు. సిసోడియా ఆదేశాలతోనే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి. ఈ మద్యం విధానంలోని కొన్ని అంశాలను మంత్రుల బృందం సమావేశంలో చర్చించలేదు. అయినప్పటికీ పాలసీని ఆమోదించి అమల్లోకి తెచ్చారు. అలా వచ్చిన అక్రమ సొమ్మును హవాలా ఛానళ్ల ద్వారా దారి మళ్లించారు. ఈ మనీలాండరింగ్లో సిసోడియా కూడా ఓ భాగమే’’ అని కోర్టుకు ఈడీ వివరించింది.
ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారం సిసోడియా ఫోన్ అని.. అయితే దాన్ని ఆయన ధ్వంసం చేశారని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. ఆయన విచారణకు సహకరించలేదని ఆరోపించిన ఈడీ.. 10 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరింది. కానీ కోర్టు 7రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది.
ఈడీ కస్టడీ అభ్యర్థనను సిసోడియా తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయడం తమ హక్కుగా భావిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘ఈ మద్యం విధానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదించారు. ఒక పాలసీని పలు దశల్లో పరిశీలించడం ఓ ఎగ్జిక్యూటివ్ బాధ్యత. మనీలాండరింగ్ కేసులో విధానాల రూపకల్పనపై ఎందుకు ఆరా తీస్తున్నారు? సిసోడియా వద్ద ఒక్క అక్రమ పైసాను కూడా ఈడీ గుర్తించలేదు. కేవలం చెప్పుడు మాటల ఆధారంగానే ఆయనపై కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ ఓ క్రూరమైన చట్టంగా మారుతోంది. కేవలం ఆయనను జైల్లో ఉంచడానికే ఈ అరెస్టుకు పాల్పడ్డారు’’ అని సిసోడియా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇలాంటి అరెస్టుల పట్ల కోర్టులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిసోదియా తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.