MLC KAVITHA: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతమైంది. సాయంత్రం నాలుగు గంటలకు దీక్ష ముగిసింది. కవితకు ఎంపీ కే కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మొత్తం 18 పార్టీలు కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నాయి.
డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటామని కవిత వెల్లడించారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని.. అన్ని రాష్ట్రాల సమస్య అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాసవుతుందన్నారు. దీనిపై రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు.
రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్లో ఉందని తెలిపారు. ఆ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చాలా రోజులుగా పెండింగ్లో ఉందని అన్నారు. 1996లో అప్పటి ప్రధాని దేవగౌడ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినా ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని.. ఈ బిల్లుపై అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు.