Avinash reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి ఉత్తర్వులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. కేసు పూర్తి వివరాలను సోమవారం సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు.
ముగిసిన విచారణ..
శుక్రవారం అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు అధికారులు అవినాశ్ రెడ్డిని విచారించారు. కీలక విషయాలను పక్కన బెట్టి తనను విచారణకు పిలిచారని అవినాశ్ రెడ్డి మండిపడ్డారు. సీబీఐ విచారణ తప్పుదోవ పడుతుందని ఆరోపించారు. కట్టు కథను అడ్డుగా పెట్టుకొని విచారణ చేస్తున్నారని.. తనపై ఆరోపణల్లో పెద్ద కుట్ర ఉందన్నారు. తనవైపు నుంచి ఎటువంటి తప్పు లేదని.. న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.