KCR : తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న సచివాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును పెట్టారు. కేసీఆర్ పుట్టినరోజును పురష్కరించుకుని ఫిబ్రవరి 17న సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. అప్పుడు అనివార్య కారణాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.
నూతన సచివాలయాన్ని తాజాగా సీఎం కేసీఆర్ సందర్శించారు. భవనం చుట్టూ తిరిగి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. సచివాలయ పనులను పర్యవేక్షించడంతోపాటు అక్కడి రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. సీఎస్ శాంతికుమారితోపాటు పలువురు ఉన్నతాధికారులు కేసీఆర్ వెంట పాల్గొన్నారు.
అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. తుది దశలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురష్కరించుకుని ఆ రోజు బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరోవైపు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభిస్తారు. ఇలా ఎన్నికలకు 6 నెలల ముందే ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులపై కేసీఆర్ దృష్టి పెట్టారు. పనులన్నీ చకచకా పూర్తి చేయించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయిస్తున్నారు.
మరోవైపు ఫిబ్రవరి 3న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలను ఘటనాస్థలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వివాదం రాజుకుంది. ఇప్పుడు పనులు తుదిదశకు చేరుకోవడంతో కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.