Avinashreddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ రెండుసార్లు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న సీబీఐ అధికారులు కడప ఎంపీని ప్రశ్నించారు.
సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ పిటిషన్లో వివేకా కుమార్తె సునీత కు ఇంప్లీడ్ అయ్యారు.
మరోవైపు వివేకా హత్య కేసులో చంచల్గూడ జైలులో జ్యుడీషియల్ ఖైదీలుగా ఉన్న సునీల్యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోపాటు గంగిరెడ్డి, దస్తగిరి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 12న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఆసక్తి రేగుతోంది.