Kavitha : ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సీతారాం ఏచూరి, తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొనన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో ఈ దీక్షను చేపట్టారు.
రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్లో ఉందని తెలిపారు. ఆ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలని ఆమె స్పష్టం చేశారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్ద పీట వేశారని అమ్మానాన్న అంటాం.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుందని వివరించారు.
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చాలా రోజులుగా పెండింగ్లో ఉందని కవిత అన్నారు. 1996లో అప్పటి ప్రధాని దేవగౌడ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినా ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని.. ఈ బిల్లుపై అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు.
కవిత చేపట్టిన దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కవిత దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. వారంతా కవితతో కలిసి దీక్షలో పాల్గొన్నారు.