Avinash: సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో శుక్రవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్లోని సీబీఐ ఆఫీస్కు రానున్నారు. ఈక్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు ఒక్కరోజు ముందు తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని పిటిషన్లో కోర్టును కోరారు. విచారణ సమయంలో అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో వినతించారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపించాలని కోరారు.
160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయొద్దని కోరుతున్నానని పిటిషన్లో అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. A4 దస్తగిరి మాటలను నమ్మి దర్యాప్తు సాగుతోందని.. తనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు సీబీఐ సేకరించలేదని పిటిషన్లో వెల్లడించారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరారు. సీబీఐ తనపై చేస్తున్న విచారణకు స్టే ఇవ్వాలని అవినాశ్ రెడ్డి విన్నవించుకున్నారు.