Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అతడిని అరెస్ట్ చేసింది. మూడు రోజులుగా తీహార్ జైల్లో సిసోడియాను విచారిస్తున్న ఈడీ.. తాజాగా అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
ఇక సిసోడియా బెయిల్ మంజూరు విషయంలో శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈక్రమంలో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది.
మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు అరెస్ట్ చేసిన సీబీఐకి ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. శుక్రవారం బెయిల్ పిటిషన్పై విచారణ ఉందనే.. ఒకరోజు ముందుగా ఈడీ అతడిని అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. సిసోడియాను బయటకు రానివ్వదని లక్ష్యంగా పెట్టుకున్నారని.. అందుకే అతనిపై నకిలీ కేసులు పెట్టి జైల్లో ఉంచాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇక ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన వారందరినీ ఈడీ అరెస్ట్ చేసుకుంటూ పోతోంది. ఈక్రమంలో కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఈడీ కవితను అరెస్ట్ చేస్తుందా..? లేదా..? అనేది 11న తేలనుంది.