Kavitha: ఈడీ విచారణపై కవిత లా పాయింట్లు బయటకు తీశారు. మహిళలను ఆమె ఇంటికి వెళ్లే విచారించాలని పలు కేసుల్లో కోర్టులు తీర్పు ఇచ్చాయని గుర్తు చేస్తూ.. తనకెందకు ఆ అవకాశం ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. విచారణ వీడియో కాన్ఫరెన్స్లో ఎందుకు చేయరంటూ మరో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ విషయంలో తాను అవసరమైతే కోర్టుకు కూడా వెళతానన్నారు.
ఢిల్లీలో 10న దీక్షను వారం ముందే ప్రకటించానని.. ఈ విషయం తెలిసి కూడా ఈడీ తనను 9న విచారణకు రమ్మని ఎలా పిలుస్తుందని నిలదీశారు. తాను మరో వారం గడువు కావాలని కోరితే ఈడీ తిరస్కరించిందని.. చివరకు 11న ఎంక్వైరీకి డేట్ ఫిక్స్ అయిందని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీకి ఇంత తొందరెందుకని ప్రశ్నించారు కవిత.
బీఆర్ఎస్ నేతలను ఈడీ, సీబీఐ, ఐటీ టార్గెట్ చేసిందని.. ఉద్యమం చేసి వచ్చాం.. భయపడేదేలే..అన్నారు కవిత. ఈడీ విచారణకు తాను వస్తానని.. ఎంక్వైరీని ఎదుర్కొంటానని.. మరి, ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్.. సిట్ విచారణకి వస్తారా? అని సవాల్ చేశారు.
విపక్షాలను టార్గెట్ చేయడం కాదు.. అధిక ధరలు, నిరుద్యోగం తగ్గించడంపై ఫోకస్ పెట్టాలంటూ కేంద్రానికి సూచించారు కవిత. నవంబర్, డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చని.. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. మా వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉన్నాయి.. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందంటూ కవిత అన్నారు.