Train: టికెట్ లేకుండా ట్రైన్లో ఎప్పుడైనా జర్నీ చేశారా?.. అమ్మో టీసీ పట్టుకుంటే వేలకు వేలు ఫైన్ వేస్తాడు.. దానికంటే టికెట్ కొనడమే బెటర్ అని కొందరు అంటే.. మరికొందరు మాత్రం పట్టుకున్నప్పుడు చూద్దాం లే అని అంటుంటారు. వాళ్లు అసలు భయం లేకుండా ఎంత దూరమైనా టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. అయితే.. ఆ ఊరిలో మాత్రం ప్రయాణాలు చెయ్యరు.. కానీ డబ్బులు పెట్టి ట్రైన్ టికెట్ కొంటారు. ఎందుకంటే..
ఉత్తర్ప్రదేశ్లోని దయాల్పుర్లో 1954లో రైల్వే స్టేషన్ నిర్మించారు. అప్పట్లో ఆ స్టేషన్లో ఫుట్ రష్ ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల వారు ట్రైన్ ఎక్కడానికి ఈ స్టేషన్కే వచ్చేవారు. రైల్వేకు కూడా మంచి ఆదాయం వచ్చేది. ప్రయాణికులతో ఆ స్టేషన్ కలకలలాడేది.
అయితే కాలక్రమేనా ఆ స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. రోజుకు ఒక్కరిద్దరు కూడా వచ్చేవారు కాదు. ఈక్రమంలో స్టేషన్ వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో అధికారులు స్టేషన్ను 2006లో మూసేశారు. దీంతో దయాల్పుర్ గ్రామస్థులు పోరాటం చేశారు. తిరిగి తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ప్రారంభించాలంటూ రైల్వే అధికారులకు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు.
కొన్నేళ్లపాటు పోరాటం కొనసాగించారు. చివరికి 2022లో అధికారులు దయాల్పుర్ రైల్వే స్టేషన్ను తిరిగి ప్రారంభించారు. మళ్లీ స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. స్టేషన్కు ఆదాయం కూడా పెరిగింది. అంతా సాఫీగా ఉన్న సమయంలో మళ్లీ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. రెండోసారి మూతపడే స్థాయికి వచ్చింది.
అయితే అధికారులు మళ్లీ స్టేషన్ను మూసివేస్తే ఎలా?.. అని గ్రామస్థలంతా సమావేశమయ్యారు. ఎంతో కష్టపడి తెరిపించుకున్న రైల్వే స్టేషన్ మూతపడకుండా చేయాలనుకున్నారు. అలా ప్రయాణాలు చేయకున్నా టికెట్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి గ్రామస్థులంతా టికెట్లు కొనడం ప్రారంభించారు.